Wednesday, 20 August 2008

నేను-సంగీతం........రెండవ భాగం

మొదటి భాగం ఇక్కడ
అలా సినీ గీతాల ఒరవడిలో పడి అటు సంగీత సాహిత్యాభిమనాలను (అవి అని నాకు తెలీకుండానే) పెంచుకుంటున్న నాకు "శంకరాభరణం" చిత్రం ఒక గొప్ప అనుభూతి. ఎనభై అయిదు నుండి ఏడు వరకు ఎప్పుడు వచ్చిందో సరిగ్గా గుర్తులేదు నాకు మన "దూరదర్శన్"లో కాని, అది చూసిన తరువాత నిజంగా సంగీతాభిమానం చాలా పెరిగింది. అందులో నాకు చాలా నచ్చిన సన్నివేశం శంకరశాస్త్రి (సోమయాజులు) గారు తన గడ్డు కాలంలో కూడా మన సంగీతానిపై మమకారం వదలక సాధన చేస్తూ, వెక్కిరించిన పాశ్చాత్య సంగీత ప్రియులకు బుద్ధి చెప్పే సన్నివేశం. అందులో ఆయన అన్నా ఒక మాట నాకు ఎప్పటికీ మరవలేనిది "సంగీతం హద్దులు లేనిది, అది పాశ్చాత్యమైనా మనదైనా...." ఇలా సాగుతుంది ఆయన ఆవేదనాభరిత వాగ్ధాటి. అంత ఆవేదనలోను ఆయన సంయమనం కోల్పోక తన సంగీతాన్నీ ప్రజలు నిర్లక్షం చేస్తున్నారని బాధపదతారే కాని పాశ్చాత్య సంగీతాన్నీ తులనాడరు. అది నాకు చాలా నచ్చిన విషయం.


ఆ చిత్ర ప్రభావం ఎంతగా పడిందంటే అప్పటి వరకు "కాకి గోలగా" (అమంగళం ప్రతిహతమగుగాక) భావించిన కర్నాటక సంగీతంపై మక్కువ మొదలయింది. కాని అది కూడా అప్పటికి ఉట్టి చిత్ర గీతాల వరకే పరిమితం అయింది. ఒకవైపు విద్యార్థిగా సాధించాల్సినది చాలా మిగిలిపోవటం, ఇంటికి పెద్ద కొడుకుగా భాద్యతలు ఎత్తుకోవాలి అన్న విషయం, ఆస్తిపాస్తులు ఏమి లేకపోవటం, సరస్వతీ దేవి కరుణిస్తే గాని లక్ష్మీ దేవి కరుణించదన్న విషయం గుర్తుండటంతో ఎటువంటే "పిచ్చి వేషాలు వేయకుండా" బుద్ధిగా చదువుపై శ్రద్ధ పెట్టాను. సంగీతాభిమానాన్ని ఉట్టి వినటం వరకే పరిమితం చేసేసాను.


అలాటి సమయంలో (నేను పట్టు వదలని విక్రమార్కునిలా EAMCET మూడవ సారి రాస్తున్నప్పుడు అనుకుంటా) నాన్న టేప్ రికార్డర్ తెచ్చారు ఇంటికి మొదటిసారిగా. ఎంతగా సంతోషించానంటే నాన్నకు ముద్దు పెట్టాను బుగ్గమీద. నాన్న సంబరంతో అమ్మతో "ఏమేవ్ నీ కొడుకు నాకు ముద్దు పెట్టాడు" అని చెప్పటం నాకు ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. నేను అప్పటి వరకు నా మనసులోని భావాలను అంతగా బయటకు ప్రస్ఫుటించిన సందర్భం మరొకటి లేదు ఎంత ఆలోచించినా ఆ రోజు.


ఇక చూసుకోండి నా సామి రంగా, రూములో లైట్లన్నీ ఆర్పేసి, కిటికీలు మూసేసి, తెరలు కప్పి ముఖేష్ గారి.రాజ్ కపూర్ పాటలు "దోస్త్ దోస్త్ నా రహా, ప్యార్ ప్యార్ నా రహా ..... " అంటూనో లేక "దునియా బనానే వాలే క్యా తేరే దిల్ మే సమాయీ , తూనే కాహేకో దేది జుదాయీ" అంటూనో, లేక ఘంటసాలగారివి "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్" అంటూనో ఆ పాత మధురాలు వింటూఉండే వాడిని, గదిలో అటూ ఇటో పచార్లు చేస్తూ. బయట అమ్మ, నాన్న నా ఈ పరిస్థితి చూసి నన్ను "ఎరా నాన్నా! ఎక్కడన్నా ప్రేమలో ఫెయిల్ అయ్యావా" అని అడిగేంతవరకు వచ్చింది. లేదని వాళ్ళకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థమయ్యి చచ్చేది కాదు. (నిజంగానే లేదండి :-)


నిజం చెప్పాలంటే నాకు ఆ విషాద గీతాలు ఎందుకు అంత నచ్చుతాయో ఇంతవరకు తెలీదు, కానీ నేను మెచ్చిన, నచ్చిన సినిమా పాటల్లో అధిక శాతం విషాద గీతాలే. అటు లవకుశలో "ఏ నిమిషానికీ ఏమి జరుగునో ఎవరూహించెదరూ" కానివ్వండి, ఆనంద్ లోని " " , లేదా రాజేష్ ఖన్నా అమర్ ప్రేమ లోని "చింగారి కోయీ భడ్కే ......"కాని, ఆంధీలోని "తేరే బిన జిందగీ సే కోయి షికవా తో నహీ, షిక్వా నహీ..... ", ముకద్దర్ కా సికందర్లోని "ఓ సాథీ రే, తేరే బిన భి క్యా జీనా..... " కానీయండి ---వీటిలో ఉన్న ఆనందం నాకు ఎంత మంచి రొమాంటిక్ పాట అయినా కాని అందులో కనపడదు. క్లుప్తంగా చెప్పాలంటే "బాదే సౌఖ్యమనే భావన రానీవోయ్" అన్న మాటల భావం బలంగా నాటుకుపోయిందేమో నాలో అనిపిస్తుంది అపుడపుడూ నా ఈ చాయిస్ చూసి నాకే.


1995 లో మూడో ప్రయత్నంలో గాందీ మెడికల్ కాలేజిలో సీటు రావటంతో ఇంకో అంకం మొదలయింది నా సంగీతాభిమానంలో. ఈ అంకానికి నాంది పలికింది నేను వైద్య విద్యార్థిగా చేరిన మొదటి రోజే. అదీ నా గార్ధభ స్వరంతో! (నిజంగానండి బాబు, కావాలంటే నా శ్రీమతినదగండి). పరంపరగా వస్తున్నా అర్థం పర్థం లేని "ర్యాగింగు" అనే ప్రక్రియలో మొదటి రోజే నా చేత తిట్లు తిన్న కోతి మూక సీనియర్లు (నాలుగు గంటలు చెండాలంగా చేసిన తరవాత లెండి, ఊరకే తిట్టలేదు వాళ్ళను ) "వాడసలే తిక్క వెధవ వాడిని ర్యాగింగు చేయటంలో మజా లేదు" అని కోతి మూక సీనియర్లు నన్ను పట్టించుకోవటం మానేస్తే సిన్సియర్ సీనియర్లు పట్టుకొని రాగ చీయటం మొదలెట్టారు. పాపం ఏమడగాలో తెలియక అనుకుంటా "నీ హాబీలు ఏమిటి" లాటి ప్రశ్నలు వేస్తుంటే చెప్పాను పాత పాటలు వింటాను, పాడుకుంటాను అని. వాళ్ల ఖర్మకాలి వారిలో ఒకడు సరే అయితే నీకు నచ్చిన "పాత పాట పాడు" అని నాకు చాయిస్ ఇచ్చాడు. అంతే నేను ఎంతో ఉత్సాహంతో "కుడి ఎడమయితే పొరపాటు...." అంటూ పాట ఎత్తుకున్నానో లేదో అందరూ spontaneus గా చెవులు మూసుకోవటం, అప్పటి వరకు బాగా మాట్లాడుతున్న ఆ సీనియర్లు "ఏం బే! ర్యాగింగు నిన్ను మేము చేస్తున్నామా లేక నువ్వు నన్ను చేస్తున్నావా, ఆపు నీ గోల" అని అరవటం తృటిలో జరిగిపోయింది. ఇంకేముంది వాళ్లకు కోపం తెప్పించినందుకు ఒకడి అనాటమీ రికార్డు మొత్తం వేసి పెట్టాల్సిన శిక్ష పడింది. (లాస్ట్ డేట్ ముందు రోజు ఇష్టమొచ్చినట్టు గెలికి రికార్డు వాడి మొహాన పడేస్తే వాడు ఏడవలేక నవ్వలేక పెట్టిన మొహం ఇంకా గుర్తుందిలెండి, అది వేరే విషయం)


ఈ ఘట్టాన్ని ఎందుకు చెపుతున్నానంటే అంతవరకు "నా గొంతు బాలేదు" అని నా ధ్యాసలోకి రాకపోవటం, ఆ రోజు అంత spontaneus గా వాళ్లందరూ చెవులు మూసుకోవటంతో నా గార్దభ స్వరం యొక్క అసలు సత్యం నాకు జ్ఞానోదయమయ్యింది. చిన్నప్పుడు ఎపుడో పక్కింటి ఆంటీ పంద్రాగస్టుకు గీతం నేర్పుతూ "కంఠమెత్తి పాడరా...ఎంత ఎత్తు ఎగిరిందో ఈ దేశపు మన జెండా" అన్న చరణంలో ఎంతకీ పైకి లేవని నా కంఠస్వరాన్ని గమనించి ఆ చరణాన్ని నా చెల్లికి నేర్పటం, మా బడిలో క్లాసులో మొదటి ర్యాంకు నాదే అయినా మా "ప్రేయర్ సింగింగు గ్రూపు"లోకి నాకు ఆహ్వానం రాకపోవటం (మా బడిలో ఆ గ్రూపులో సభ్యుడవ్వాలంటే బాగా చదివే వారన్న అయి ఉండాలి లేదా నిజంగా సూపర్ కంఠ స్వరమన్నా అయి ఉండాలి) ఇవన్ని చక చకా కళ్ళ ముందు తిరిగాయి. అసలు నాది కాదండి తప్పు ఈ విషయంలో, "మా అమ్మా నాన్నలది, మా చెల్లెళ్ళదీను, ఎంత కాకి పిల్ల/అన్న కాకికి ముద్దయితే మాత్రం అంతగా నోరు మూసుకొని భరించాలా అని అడుగుతున్నా యువరానర్! ముందే చెప్పుంటే నాకు ఇన్ని అవమానాలు తప్పేవి కదా." అలా నా కంఠస్వరం బాలేదని తెలియడం నాంది అనమాట ఈ అంకానికి.

(సశేషం)

Saturday, 16 August 2008

మా అత్తగారా?



"అత్తను మింగావు" నాపై తన కోపం

" పెళ్ళికి ఇరవై ఏళ్లకు పూర్వం నేనా కారణం?" నా ఆక్రోశం

"ఆశ్లేష జన్మనక్షత్ర ప్రభావం" తన గూడార్థం

ఇలా సాగేను అపుడపుడూ మా చిలిపి జగడం


అర్ధరాత్రి పన్నెండు గంటలు, చదువుతూ కుస్తీల నేను

నా కిటికీ బయట పావురం, పడుతున్న వర్షానికి తల దాచేను

శ్రీమతి కంటబడటం, బ్రెడ్డు ముక్క ప్రత్యక్షం మరుక్షణం

ముక్కు దాక మేక్కిందేమో నాన్ వెజ్జి, ముట్టనంది అది బ్రెడ్డు


"మా అమ్మ నన్ను చూడటానికి వచ్చింది" తన సంతోషం

"నువ్వు ఉన్నావని తినట్లేదు, పో కిందికి" - హుకుం జారి

అటకెక్కింది చదువు-తప్పుతుందా మరి

"భరించే వాడంటేనే భర్త" - హరి హరి!



కిటకీలో కనబడ్డ పావురంలో తల్లిని చూసుకున్న నా శ్రీమతి చేష్టలకు ముచ్చటపడి రాసుకున్న చిన్న కవిత, ఈ సంఘటనకి కారణభూతమైన పావురం.

నేను-సంగీతం---- మొదటి భాగం

సుమారుగా పదేళ్ళు ఉంటాయేమో నాకు అప్పుడు. మేము అద్దెకు ఉండే ఇంటి వాళ్ళింట్లో వారానికి ఒకరోజు మాత్రమె వచ్చే తెలుగు చిత్రాన్ని, అదీ నలుపు తెలుపు చిత్రం అనుకుంటా, వాళ్ల daynora TV లో చూసి బయట ఆడుకుంటున్నాను మిగితా పిల్లలందరితోనూ కలిసి.

"చూడవోయ్ లక్ష్మీ, నీ కొడుకు అప్పుడే నేనూ మా ఆవిడా అంటూ పాట పాడుతున్నాడు" అని మా ఇంటి ఓనరు ఆంటీ మా అమ్మతో పరాచికాలాడుతుంటే గాని అర్థం కాలేదు నాకు ఏదో పాటను బయటకే పాడేస్తున్నానని. అమ్మను మెల్లగా అడిగా "ఏం పాడానే?" అని. అమ్మ విరగబడి నవ్వుతూ "పాలూ మీగడ, పెరుగూ ఆవడ ......నేనూ మా ఆవిడా (16th song in 80s songs).... నాయనా నువ్వు పాడింది" అని అనేసరికి ఎక్కడ లేని సిగ్గొచ్చింది. పైకి పారిపోయి మా వాటాలో దాక్కున్న సంగతి నాకు ఇంకా గుర్తే.

తరవాత అదే ఆంటీ ఇంట్లో చిత్రలహరి ముందు వచ్చే advertisements లో "ఆప్కో చేనేతలు, అందమైన చీరలు" అన్న APCO advertisement ట్యాగ్ లైన్ తో స్వరం కలిపి, నన్ను నేను మరిచిపోయి, అందరి ఎదుటా (దాదాపు పదిహేను మంది చేరే వాళ్ళం ఆ అంటీ ఇంటి డ్రాయింగు రూములో రాత్రి ఎనిమిదిన్నరకు చిత్రలహరి కోసం 1984 వరకు) "ఆప్కో చేనేతలు అందమైన టీచర్లు" అని అనేసి ఆ ఆంటీ చేతిలో చివాట్లు కూడా తిన్నాను.
అలాగే ఆరోగ్యం బాలేనపుడు అమ్మ ఒడిలో పడుకొని తన మధుర కంఠంతో నాకు నచ్చిన సినీ పాటలు పాడిపించికుంటూ నొప్పిని మరచిన రోజులు కూడా ఇంకా గుర్తు.

ఇంతా ఉపోత్ఘాతము దేనికి అంటే "నేను చిన్నప్పటి నుంచీ మంచి సంగీతమంటే పడి చచ్చే వాడిని" అని చెప్పటానికి అన్నమాట. అలా చిత్ర గీతాలతో, advertisements tag lines తో మొదలయింది నా సంగీతాభిలాష. మొదట మొదట అది దాదాపుగా చిత్ర గీతాలకే పరిమితమయిండేది. ఎంతగా ఇష్టపడే వాడినంటే రాత్రి తొమ్మిది దాటాక పిడుగులు పడ్డా నిద్ర మేల్కోని నేను, పదిన్నరకి అనుకుంటా, మొదలయ్యే "ఏక చిత్ర గీతాలు" కార్యక్రమం కోసం చల్ల నీళ్లు మొహం పై కొట్టుకొని అయినా మేల్కొనే వాడిని. (దానికి తొడు మా నాన్నని ఎదిరించయినా, ప్రతి మంగళ వారం అనుకుంటా, ఆ కార్యరమం రేడియోలో పెట్టించే నా రాకాసి పెద్ద చెల్లి నాకు కొండంత అండ లెండి ఆ విషయంలో మాత్రం).

అలా కొంచం కొంచంగా బలపడసాగింది నా సంగీతాభిలాష. అయితే అప్పటికి "సంగీతాభిలాష" ఇలాటి conceptual భావాలు ఏవీ ఉండేవు కావు. "పాట నచ్చింది, మాటలు బావున్నాయి" ఇవి మాత్రమె తెలిసేది. పైగా శాస్త్రీయ సంగీతం అంటే చూపు ఉండేది "చ! ఎప్పుడూ ఒకటే గోల ఆ...ఆ..అంటూ ఒక్క అక్షరాన్ని లాగుతూ పీకుతూ ఉండటమేగా అది" అని కారుకూతలు కూసి దూరదర్శన్లో వచ్చే మంగళంపల్లి గారి సంగీత కచేరిని తులనాడిన సందర్భాలు కూడా గుర్తే. (ఇపుడు అదే మంగళంపల్లి వారి కచేరి నిజంగా ఇక్కడ మా UK లో జరగాలె కానీ "అవునులే international film festival యార్కులో జరుగుతోంది, మనకు గంటే దూరం అన్నా తీసుకుపోలేదు కాని ఇప్పుడు నీకు నచ్చిన కచేరి కోసం అంత దూరం వెళ్తానంటావు" అని నా శ్రీమతి చేత శఠగోపం పెట్టించుకోటానికయినా సిద్ధమే)

కొంచం కొంచంగా వయసూ,ఊహ, జ్ఞానం పెరిగే కొద్దీ ఈ పాటలు ఇష్టమవాడమే కాకుండా emotional memories జత అవటం మొదలెట్టాయి ఈ పాటలతో. పొద్దున్న పూట నీరెండలో బడికి వెళ్తూ "భూలే భిశ్రే గీత"లోనో ఇంకో దేంట్లోనో "నూరీ..... నూరీ....ఆజారే....." అంటూ వచ్చే పాటలు ఎంతగా మనసును గిలిగింతలు పెట్టేవో చెప్పలేను. ఆరోజు మొదటి పీరియడ్ అంతా నా ఇష్టమయిన సహధ్యాయినులు అందరూ "నూరీలుగా" అనిపించి ఎంత అల్లరి పెట్టే వారో మనసును. (మనసును ఎంత అల్లరి పెట్టినా స్కూల్లో ఎవ్వరినీ ఏడిపించలేదండీ బాబూ. ఉట్టి "రాముడు మంచి బాలుడినే" . దానికి ప్రమాణము నాకు ఏ బడిలోనూ ఎవ్వరూ కట్టని రాఖీలు, కావాలంటే ఆ రాఖీ దేవతనే అడగండి సాక్షం:-)

అలాగే "ప్రాభాత మంగళ పూజా వేళా...... నీ పద సన్నిధి నిలబడీ....., నీ పద పీఠిక తలనిడీ......." అన్న భక్త తుకారాం పాట, "ఎన్నీఎల్లో.... ఎన్నీఎల్లో సందామామా...పిల్లాదానీ మనువూ సేయి సందామామా..." భక్త కన్నప్ప పాటా పొద్దునే వినటం చాలా ఇష్టమయ్యేవి. ఆ అలవాటు ఎంతగా నాటుకు పోయిందంటే ఇప్పటికీ ఆ మూడు పాటలు నేను పొద్దుటి పూట నీరెండలో మాత్రమె వింటాను. నీరెండ లేకపోతె విననే వినను.

అలాగే మా న్యూ నల్లకుంట కొత్త రామాలయం దగ్గర ఉన్న సందులో BJP వారి ఎన్నికల కార్యాలయం నుంచి వచ్చే "I am a disco dancer" అన్న మిథున్దా పాటలకు ఉర్రూతలూగిపోతూ ఊగటం, పంద్రాగస్టు నాడు "ఏయ్ మేరె వతనుకే లోగో, జరా ఆంఖ్ మే భార్లో పానీ" అన్న లతాగారి పాటకు కన్నీళ్లు పెట్టాం కూడా అలవాటయ్యాయి. ఇప్పటికీ ఆ పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

(సశేషం )

Monday, 11 August 2008

పెళ్ళంటే..................?





పెళ్ళంటే పందిళ్ళు,
సందళ్ళు, తప్పెట్లు
తాళాలు ........తలంబ్రాలూ..............
మూడే ముళ్ళూ.......ఏడే అడుగులూ..............
మొత్తం కలిపీ నూరేళ్ళూ.......


కాదమ్మా.

పెళ్ళంటే దొబ్బుళ్ళు

దెబ్బల్లు, కన్నీళ్లు
కొప్పుల్ల గొడవల్లు
కారాలు.......... మిరియాలూ.......
మూడే ముళ్ళూ..... ఏడే అడుగులూ.....
మొత్తం బాధల్లు నూరేళ్ళూ..................

నా భార్య చిత్రలేఖన విద్యకూ, నా కవితాపాఠవానికీ ఎంత బాగా కుదిరిందో చూసారా? :-). ఇంతకంటే బాగా రాయగాలవారు ఎవరైనా ఉంటే ప్రయత్నించవచ్చు.

జమ్మూ హిందువుల ఘోష - సైలెంట్ మెజారిటీ గళానికి ప్రతీకా?

"హిందువులు తమకు అన్యాయం జరిగినా పట్టించుకోరు
పట్టించుకోనేది మేమొక్కరమే!
మమ్మల్ని ఖండించిన వాడు హిందూ కాడు"
ఇలా సాగే అతివాదులకిది కనువిప్పా?


మత అసహనతను ఖండించే ప్రతివాడూ
"సూడో సెక్యులరిస్టు " అయిన ఈనాడు,
"హిందూత్వము" అతివాద పదమైన నేడు
ఇది మితవాద హిందూ ఆత్మ ప్రకటనా?


"హజ్" లకు సహాయం చేసే రాచరికం
"అమర్ నాథుల"కు సహాయార్థం
చేసిన "భూదానం" చేసెను స్వకైంకర్యం
ఈ శిఖండులకు లేదేలా సిగ్గు-షరం ?


రెండు మూడు నెలల భూమి వాడుక
ఎలా అయ్యె రా అది జనాభా మార్పు ప్రాతిపదిక?
ఈ వాదనకు తల వొగ్గిన చేవ లేని రాచరికం
కనరాదా కాశ్మీరంలో పండితులపై అరాచకం?


రాజకీయాలు, కుళ్ళు కుతంత్రాలు
మనకేమిలేమని ఊరుకొనే నీరసత్వాలు
మత సంరక్షణ మరచిన మఠాలు
ఇవేనా నేటి మన హిందూ జవ సత్వాలు?


కాదు నేటి అవసరం "అపర చాణక్యం",
కాదు "ఎవరో వస్తారని ఏదో చేస్తారని " ఎదురు చూడటం,
అలాగే-కాదు "వారి"ని పీచమణచటం పరిష్కారం
దీనికి ఒకటే మార్గం- సైలెంట్ మెజారిటీ గళం.


"మాకు అన్యాయం జరిగిందంటూ" ఘోషించాలి
"సహించేది లేదంటూ" ఉపక్రిమించాలి, సాధించాలి
రాకూడదు "అతివాద కలిమి" ఈ ఘోషకు
కారాదు మితవాద మేక అతివాద పులికి బలి నేడు.



జమ్మూలో జరుగుతున్న పోరాటంలో సైలెంటు మెజారిటీ గళం వినిపించింది. దీని వెనుకే అతివాద మతపార్టీల రాజకీయత పొడసూపింది. రెంటికీ మైత్రి కుదరకూడదని ప్రార్థిస్తూ.......

Monday, 4 August 2008

మధ్య తరగతి విలువలు బాబోయ్!!!

ఈ మధ్య తరగతి విలువలు ఉన్నాయి చూసారూ, వీటితో చాలా తంటాలండి . మొన్నటికి మొన్న "ఏంటి నిన్న ఇంటికి వచ్చి మరీ పారిపోయావంటా?" అన్నాడు మురళి. "నా జూనియర్ గాడు నన్నింత మాట అంటాడా, ఏదో సిన్సియర్గా ఉందామని వీళ్ళని రాగింగ్ చేయకపోవటం నాదే తప్పు" అని మనసులోనే పళ్ళు నూరుకొని బయటికి మాత్రం "హి హి హి నేను పారిపోయానా? ఎప్పుడూ?" అని బోల్డు ఆశ్చర్యపోయా . "అదే దీపిక స్నానం చేసి బయటకు వస్తే నువ్వు పారిపోయావంటా" నవ్వుతూ అన్నాడు మురళి. నాకు ఏం చెప్పాలో అర్థంకాక మిన్నకుండి పోయాను.

మనసు కొంచం చివుక్కుమంది. "అదేంటి, తన పెళ్ళాం అప్పుడే స్నానం చేసి వస్తే నేను అక్కడ ఉండకుండా మర్యాదగా నా రూంకు నేను వెళ్ళిపోతే ఇలా అంటాడు నేనేదో పిచ్చోడిని అయినట్టు, ఏదో చిన్న పిల్లాడి చేష్ట చేసినట్టు మాట్లాడతాడు." అని అనుకున్నమాట నిజం.

ఇంటికి వచ్చినప్పటినుంచి ఇదే ఆలోచిస్తున్నాను ఎందుకు నాకు బాధేస్తోంది? ఏమిటి దీనికి కారణం? తప్పంటూ ఉంటె అది ఎవరిదీ? నా మధ్యతరగతి విలువల ప్రకారం, నేను నేర్చిన సంస్కారం ప్రకారం అది నా తప్పు కాదు, నేను చేసింది ఒప్పే.

కాని మరి తను అలా ఎందుకు అన్నాడు? వాడికి ఈ విలువలు లేవా? వాడికి తప్పనిపించలేదా? అనిపించలేదనే అనిపిస్తోంది. లేకుంటే నన్నెందుకు అలా హేళనగా మాటాడతాడు?

ఇలా ఈ మధ్య నేను నా విలువల వల్ల కొంచం ఇబ్బందికి గురవటం ఇదేమీ మొదటి సారి కాదు. ఇంతక ముందు కూడా ఇలా ఇబ్బంది పడ్డ సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఈ జంటనే తీసుకుందాము. వీళ్ళిద్దరూ నా మెడికల్ కాలేజిలో నాకంటే రెండు సంవత్సరాల తరువాత చేరినవారు. అయినా నాకు ఇక్కడ ఇంగ్లండులో వచ్చి ఇక్కడ కలిసేవరకు ఆ అమ్మాయి అస్సలు పరిచయం లేదు, మురళితో మాత్రం ముఖ పరిచయం ఉంది. వాడిని మొదటిసారి విమానాశ్రయాన్నుంచి రిసీవ్ చేసుకున్నది కూడా నేనే. కాని తరువాత రెండు సంవత్సరాల వరకు అత్తా పత్తా లేదు మళ్ళీ విధివశాత్తు ఈ ఊరిలో రెండు నెలల క్రితం కలిసేవరకూ. అప్పటినుంచి బాగానే దగ్గరయ్యారు ఇద్దరూ. ఇంకా పెళ్లి కాని నాకు, నా రూమ్మేట్కు మంచి స్నేహితులయ్యారు.

అప్పటి నుంచే నా ఇబ్బంది మొదలయింది. అందరూ ఆ అమ్మాయిని "నువ్వు" అనే పిలిచేవారు. నాకు మాత్రం చచ్చే ఇబ్బంది అయ్యేది. నాకంటే రెండేళ్ళ జూనియర్ అయినా, నాకు అప్పటి వరకు పరిచయం లేని అమ్మాయి తను, అందునా స్నేహితుని భార్య. ఎంత ప్రయత్నించినా "నువ్వు" అని వెంటనే వచ్చేది కాదు. "మీరు" అని పిలిస్తే అందరూ వింతగా చూసేవారు అని అనిపించేది. వారు నోటీసు చేసారో లేదో కాని నాకు మాత్రం "ఒంటి కాయ శొంఠి కొమ్ము" ఫీలింగ్ వచ్చేది. ఈ మొహమాటంతో, ఒక సారి నువ్వు అని, ఒకసారి మీరు అని పిలిచి వాళ్ళను కూడా తికమక పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఈ ఉదాహరణను పరిశీలిస్తే మాత్రం నాదే తప్పు అని అర్థం అవుతుంది. నా విలువల మీద నాకే నమ్మకం లేకపోవటం, వాటి మీద నిలబడ లేకపోవటం కారణాలు అని అనిపించింది. వీటికి కారణం అందర్లో నేనూ ఒకడిని, "ఒంటి కాయ శొంఠి కొమ్మును" అనిపిన్చుకోకూదదు అన్న తాపత్రయమే అని అర్థమయ్యింది.

సైకాలజీ ప్రకారము ఈ "గుంపులో గోవిందం" అన్నది చాలా పరిశోధింపబడ్డ విషయం. వారి ప్రకారం ఈ "గుంపులో గోవిందాలకు" ఎక్కడలేని ధైర్యము వస్తుందట, ఒంటిగా ఉన్నపుడు చేయని పనులని కూడా, గుంపులో మమేకమయినపుడు, తమ నైజానికి, సామాజిక విలువలకు వ్యతిరేకమయిన పనులను కూడా "ధైర్యంగా" చేస్తారట. అందుకనే మనిషి చాలా వరకు గుంపులో గొర్రెలవుతారట.

నేను కూడా అలాటి మనిషినే కదా అందుకని గుంపు విలువలు నా విలువలు వేరయే సరికి ఊపిరి అందని మనిషిలా ఇబ్బంది పడతాను. అలా అని పెంపకం, స్మస్కారం, వ్యక్తిత్వం వలన వచ్చిన విలువలను అంత సులువుగా వదులుకోనూ లేను. అందుకే ఈ సంఘర్షణ అని అర్థం అయ్యింది.

"కరిగిపోయాను కర్పూర వీణలా ....కలిసిపోయాను మీ వంశధారలో" అంటూ మనసుకు నచ్చచెపుకొని వారిలో చేరిపోవటమో, "నేను పుట్టాను-లోకం చచ్చింది...........నాకింకా లోకంతో పని ఏముంది? DON'T CARE" అని పాడుకొని నా దారిలో నేను నడవటమో జరిగే వరకూ ఈ పితుకులాట తప్పదనీ అర్థమయింది. చూద్దాం ఏం జరుగుతుందో?

ఇలా జీవితం గడుస్తూ ఉంటే, కొన్నాళ్ళకు వెతగ్గా వెతగ్గా "నాకు తగ్గ బొంత" ఒకటి దొరికితే దాన్నే కట్టుకున్నా. అదేనండి పెళ్లి చాస్కున్నా. దాని తరువాత ఈ విలువలు నా జీవితంతో ఫుట్బాలు ఆడుకోవటం మరీ ఎక్కువయింది.

మొన్నటికి మొన్న నా ఇంటి పక్కనుండే నా సహోద్యోగి శ్యాంగాడు "మరేం పర్లేదు రఘూ, మావి మీరు వాడుకుంటూ ఉంటె ఏవైనా పాడవుతే ఏం ఫర్లేదులే" అన్నాడు, "బాలికా, భయమ లేదు నాతొ రా, నిన్ను స్వర్గ లోకానికి పంపే ఏర్పాటు చేస్తా" అంటూ శ్రీదేవిని ట్రాప్ చేయచూసిన అమ్రీష్ పురిలా. "మరి పరుల సొమ్ము పాము వంటిది" అని అమ్మ చెప్పిన సద్దన్నం మూట మాటేవిటి అని మనసు నన్ను నిలదీసింది. "ఆగవే ఆలోచించనీవా, నీ దుంప తెగా" అని మనసుని మనసులో అనుకోపోయి పైకే అనేసి నా "బొంత" చేతుల్లో తల బొప్పి కట్టించుకోనేంత ప్రమాదం కొనితెచ్చుకొన్నా.

ఎలాగో అలా దాన్నుంచి తప్పించుకొని ఆలోచిస్తే నాకయిన జ్ఞానోదయం ఇదండీ-పరుల సొమ్ము పాము వంటిది నిజమే. కాని అది వేటికి వర్తిస్తుంది? "మనము ఏదయితే కొనుక్కోలేమో అది పాము వంటిది" ఎందుకంటే అలాటి వస్తువు మనం ఇతరుల నుంచి తీసుకొని పాడుచేస్తే అది వారికి కొనివ్వటం మనకు అనవసరపు ఖర్చు అవుతుంది, అందుకని అలాటివి వాడకూడదు. మనకు చిన్నపుడు చెప్పిన కథలో ఆ సోమిదేవమ్మ తన తాహతుని మించిన నగ తీసుకుపోయి పారేసుకుంటుంది కదా అలాగనమాట.
మనము ఎవరి దగ్గరియితే అరువు తీసుకొని పాడు చేస్తే "అవసరాన్ని మించి అతిగా ఫీల్" అవుతారో అలాటి వారు "పరులు" అవుతారు, వారి వస్తువు "పాము వంటిది అవుతుంది". అలాటి వారి దగ్గర మనం తీసుకోకూడదు. ఇవండీ నాకు తెలిసిన నిజాలు.


అయితే ఈ నిజాలు శోదిస్తూంటే నాకు ఇంకో బల్బు కూడా వెలిగిందందోయ్. సీమా బల్బు, ECE బల్బు కాదు ఐడియా బల్బు అనమాట. అదేంటంటే "పెద్ద వాళ్ళ మాటలు సద్ది అన్నం మూటలే కావచ్చు కాని అవి పనికి వస్తాయో లేదో చూసుకోకుండా తింటే విరేచనాలే"

వాడుక భాషలో చెప్పాలంటే- మనం నేర్చిన విలువలు, మనకు ఎదురైన ప్రతీ సందర్భంలో, "ఈ సందర్భానికి ఇది సరిపోతుందా" అని ఆలోచించాలి, అపుడే మనం విజ్ఞత ఉపయోగించినట్టు. లేదంటే schematics ప్రకారం పనిచేసుకు పోయే కంప్యూటర్లకు మనకు తేడా ఏం ఉంటుంది చెప్పండి.

మా ష్రింకుల భాషలో చెప్పాలంటే "kohlberg's post conventional morality అనమాట - stage 6 morality-the highest stage of morality- where a man decides morality not just based on what is right or wrong rigidly but based on a principle of "universal ethical ప్రిన్సిపల్స్"-

Thus, a man who has attained this Post conventional stage of morality decides what is right or wrong in each given event based on the specific circumstances of the event, not just on what society/tradition/culture deems right or wrong"(వివరాలకు http://en.wikipedia.org/wiki/Kohlberg చదవండి )



అయ్ బాబోయ్!!!! ఎన్ని ట్యూబులైట్లు వెలిగించేసానో ఒకేసారి. "బత్తి బంద్" గ్యాంగు వచ్చి "ఒకేసారి ఇన్ని వెలిగించావ్" అంటూ నా మీద గయ్ మనేలోగా నేను గప్ చుప్ అయిపోతా. బై.


ps- పైన రాసిన దాంట్లో అచ్చు తప్పులు కాక ఇంకో తప్పు జరిగింది కనుక్కోండి చూద్దాం ;-) దిద్దటానికి బద్ధకం వేసి ఇలా మీకు పని పెడుతున్నా.