Thursday, 17 July 2008

2. "పట్నవాసపు బైతులు"

పేరు సరిగ్గానే చదివారండి మీరు, "పల్లెటూరు బైతు" కి పొరపాటున "పట్నపు బైతులు" అని రాయలేదు. ఎందుకంటే ఇది మా హైదరబాదు పట్నపు బైతుల కథ కాబట్టి. మామూలుగా అందరూ పల్లెల్లో, టౌనుల్లో పుట్టి పెరిగిన వారిని బైతులు అనటం కద్దు. కాని నాకు మాత్రం పట్టణాలలో పుట్టి పెరిగే మాలాటి వారు ఎంత బైతుల్లా ప్రవర్తిస్తారో అన్నది మాత్రమె బాగా అనుభవం. దాని కథా కమామిషు చెప్పటానికే ఇవాళ మీ ముందుకు వచ్చాను.


అమ్మా, నాన్నలది ఇద్దరిదీ కర్నూలు అయినా ఉద్యోగ రీత్యా నాన్న అరవై రెండులో హైదరాబాద్లో స్థిర పడ్డారు. ఇక్కడే పెళ్లి, పిల్లలూ, సంసారం, రిటైర్మెంట్ అన్నీ సాగించిన నాన్నను చూస్తె నాకు నిజంగా ఆశ్చర్యమేస్తుంది, భయమేస్తుంది. "అంతగా, పుట్టిన ఊరును ఎలా మర్చిపోగాలరా?" అనీ, నేనూ అలాగే తయారయి హైదరబాదును పూర్తిగా మర్చిపోతానా అని, కాని అది ఇప్పటి కథకు అప్రస్తుత ప్రసంగం అవటం వలన ఆపేస్తున్నాను.


నేను, ఇద్దరు చెల్లెళ్ళు మొత్తం ముగ్గురం మా అమ్మ నాన్నలకు. పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదులోనే. మేమే ఈ కథలో నాయికా నాయకులము. అంటే ఏమిటో అనుకొనేరు, మేమే ఆ "పట్వాసపు బైతులము" అన మాట.


"ఈ కథలో ఇతర పాత్రలు పోషించినది- దేవలరాజు భాగ్యలక్ష్మి గారు--బైతులకు అమ్మగా, , కీ. శే నాగ లక్ష్మమ్మగారు బైతులకు చిన్న పెద్దమ్మగా (పెద్ద పెద్దమ్మ వేరే ఉన్నారు లెండి అందుకని ఆ పేరు ) మరియు ఒక అతిధి మరియు విలక్షణమైన పాత్రలో ఒక ఎడ్ల జంట నటించడమైనది " (శని, ఆది వారాలలో మద్యాహ్నం పూట AIR లో చిన్నప్పుడు నాటకాలు వినటం అలవాటు ఉన్నవారు, నాటకం అయిపోయాక వచ్చే ప్రకటనలాగా ఊహించేసుకోండి.)


కథలోకి వస్తే మా అమ్మమ్మా వాళ్ల ఊరు "లంజ బండ", కర్నూలు జిల్లా లోది. అదేం పాపం చేసుకుందో ఆ ఊరు, పాపం ఆ పేరు వచ్చింది (స్థల పురాణం తెలిసిన వారెవరయినా ఉంటే తెలిపి పుణ్యం కట్టుకోండి). పలకటానికి చండాలంగా ఉందని చిన్నప్పటి నుంచి మేము దాన్ని L బండ అనటం అలవాటు చేసుకున్నాము. (ఎప్పుడు L బండ మా ఊరు అని చెప్పినా ఆ "L" అంటే ఏమిటో ప్రతీ ఒక్కరికి వివరించాల్సి వచ్చేది-అది వేరే విషయం లెండి. ) అందుకని ఇప్పుడు కూడా L బండ అనే పిలుచుకుందాము దాన్ని.

అలా L బండలో ఉన్న అమ్మమను కలవటానికి మేము వెళ్ళిన ఒకానొక యాత్రా ప్రహసనం వినండి మరి. అప్పటికి నాకు పట్టుమని పదేళ్ళయినా ఉండవేమో, ఇంక నా చెల్లెళ్ళకు ఎనిమిది , ఏడు కూడా దాటి ఉండవు. వేసవి శలవులకు అని మా అమ్మమ్మా వాళ్ల ఊరికి ప్రయాణం అయ్యాము మేము, మా అమ్మ. అమ్మమ్మ అప్పట్లో మా చిన్న పెద్దమ్మకూ, తన ఇద్దరు కొడుకులకూ తోడుగా ఉండేది ఆ ఊర్లో .

ఆ ఊరు చేరాలంటే అప్పట్లో కర్నూలు దాక రైలులో ప్రయాణం, ఆ పైన అక్కడి నుంచి ఎడ్ల బండి పై ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఏకళనున్నామో ఏమో, రైలు ప్రయాణం బానే జరిగిందనిపించాము, ఒక్క కోతి చేష్ట కూడా లేకుండా.


ఆ కోతి చేష్ట అంటే గుర్తు కొచ్చింది. మా "గబ్బిలాయి"తనం ఆ రైలు ప్రయాణంలోనే కొంచం బయట పడినట్టు గుర్తు. మేమందరము కూర్చొని మామిడి పండ్లు తింటుంటే ఏదో స్టేషను దాటాక కంపార్టుమెంటులోకి వచ్చిన కోతులను చూసి "అమ్మా చూడవే చాలా ఆంజనేయ స్వాములు వస్తున్నాయి" అని మా చిన్న చెల్లెలు అనటంతో కంపార్టుమెంటు అంతా నవ్వులతో నిండిపోయింది. (హైదరాబాదు నుంచి కర్నూలు వెళ్ళే రూట్లో ఏ స్టేషనో గుర్తు లేదు కాని చాలానే ఉంటాయి ఈ కోతులు అక్కడ. వాటికి ఎంత ధైర్యమంటే కంపార్టుమెంటు లోకి వచ్చి మనుషుల చేతుల్లోవి సహితం తినుబండారాలు లాక్కు పోయేవి).


మా ఇంటికి కోతిని ఆంజనేయ స్వామి వేషం వేయించుకొని తీసుకొస్తే ఎప్పుడో చూడటం తప్ప అప్పటికింకా మేము కోతులను ప్రత్యక్షంగా చూసినది లేదు. అందుకని మా చిన్న దానికి అప్పుడు అమ్మ "తప్పు నాన్నా, కోతి అనకూడదు ఆంజనేయ స్వామి" అనాలి అని అమ్మ అనటం దాని చిన్ని బుర్రలో ఎంతగా నాటుకుపోయిందంటే అన్ని కోతులను చూసినా అవి దానికి "కోతులు" కాకుండా "ఆంజనేయ స్వాములే" అయ్యాయి. ఈ మాటలు విని పెట్టెలో ఉన్న ఒక ముసలమ్మ "ఇదెక్కడి చోద్యమమ్మా! ఎంత పట్నం పిల్లలైతే మాత్రం కోతుల్ని చూసి ఆంజనేయ స్వాములు అంటారు" అని బుగ్గలు నొక్కుకున్న తీరు నాకు ఇంకా జ్ఞాపకమే. అవును మరి నా చెల్లెల్ని అంటే మరి నాకు కోపం రాదా మరి? కాని ఏమి చేయలేని చిన్నతనం ,కదా అందుకనే అంతగా జ్ఞాపకం ఉండిపోయింది.


మొత్తానికి అలా రైలు ప్రయాణం చేసి కర్నూలులో దిగాము. అక్కడి నుంచి ఎక్కడ ఎడ్ల బండి మాట్లాడుకున్నామో, ఎంత సేపు గడిచిందో గుర్తు లేదు కాని గుర్తున్నదంతా మిట్ట మద్యాహ్నం వేళకు మేమింకా ఊరుకు చేరలేదు . సరేలే అందరికీ ఆకలేస్తోందని అనుకోని బండి వాడిని మార్గ మధ్యమ్లోనే ఆపించి, కర్నూలు నుంచి కట్టుకొచ్చుకున్న ఇడ్లీలు తినడం ప్రారంభించాము, బండి వాడికి కూడా ఇన్ని పెట్టి.

నేను చూస్తుండగానే వాడు తనకు ఇచ్చిన నాలుగు ఇడ్లీలు నాలుగు గుటకల్లో లాగించేసి ఎడ్లకు నీరు పెట్టటం చూసాను. ఇంకేముంది, నేను అమ్మ దగ్గర పోరు పెట్టటం మొదలెట్టాను "అమ్మ చూడవే వాడు ఇడ్లీలు అన్నీ తనే తినేసాడు మరి పాపం ఎడ్లకు? ఇంకొన్ని వాడికి ఇవ్వు ఎడ్లకు పెడతాడు" అని.

చూసారా మన తెలివి. ఇంట్లో కుక్క ఉంటే దానికీ ఇడ్లీలతో సహా అన్ని శాఖాహారాలు అలవాటు చేసిన నేను, ఇక్కడ కూడా ఎడ్లు కూడా దాని లాగే ఇడ్లీలు తింటాయి అని అనుకున్న తెలివి అన్న మాట. అవును మరి, చందమామలోనూ, బాల మిత్రలోనూ, సంక్రాంతికి డూ డూ బసవన్నలనూ తప్ప ఇతరత్రా ఎడ్లని ఎరుగని మేము అవి ఏమి తింటాయో ఎలా తెలుసుకుంటాము?

అలా అమ్మ దగ్గర మొండికేస్తున్న నన్ను చూసి బండి వాడు ఎడ్లకు నీళ్లు, ఎండు గడ్డి వేసోచ్చి "ఏమంటున్నాడమ్మా చిన్నయ్యా?" అని నవ్వుతూ అంటే వాడికేదో సర్ది చెప్పక "నువ్వే అడుగు" అని చెప్పాను అని నవ్వే అమ్మంటే ఇప్పటికీ నాకు కోపమే. ఉండదా మరి? ఆ ఎడ్ల బండోడి దగ్గర నా పరువు తీసిన మాటే కదా అది. ఆ మాట విని వాడు నింపాదిగా నన్ను "ఏంటి చిన్నయ్యా?" అని అడగ్గా నేను పెద్ద హీరోలా పోజు పెట్టి "ఇడ్లీలు అన్నీ నువ్వే తినీసవ్ వాటికి కూడా పెట్టొచ్చుగా" అని అడగ్గానే వాడు నవ్విన నవ్వు నేను జన్మ మరిచిపోలేను. అంతగా కిందా మీదా పడి నవ్వాడు వాడు.


చివరికి నవ్వాపుకొని (ఇడ్లీలు పెట్టకుండానే) ఎడ్లను మళ్ళీ బండికి కట్టి ప్రయాణం మొదలెట్టిన కొంచం సేపటికి ఎదురుగా ఇంకో ఎడ్ల బండి వస్తూ కనిపించింది.సిటీలో నాన్న "హిరో మజేస్టిక్" బండి మీద trebles వెళ్తూ నాన్నకు చెప్పినట్టే, భయమేసి "బండాయనా బండాయనా, జాగ్రత్త! accident అయిపోతుంది మెల్లగా పోనియ్" అనేసాను.

ఇంక చూసుకో నా సామిరంగా, వాడు వెళ్తున్న ఆ బండిని కూడా ఆపి మరీ ఈ మాట చెప్పి నవ్వ సాగాడు. ఆ బండిలో వెళ్తున్న సెట్టిగార్లు, సెట్టమ్మలూ ఆ మాటలకు నవ్వి నవ్వి అలసిపోయి "భాగ్యమ్మా భలే కొడుకును కన్నావమ్మా" అని అనేసరికి కాని మా అమ్మకు తెలీలేదు తన తప్పేంటో. బండి వాడిని కసిరి బండిని బయలుదేర తీసిన తను నన్ను తన ఒళ్ళో కూర్చో పెట్టుకొని "ఇంట నెమ్మదిగా వెళ్తుంటే, అదీ ఎడ్ల బండ్లల్లో accident అవదు నాన్నా" అని బోధిస్తే తప్ప వెలగని ట్యూబులైటు బుర్ర అప్పట్లో నాది. కొసమెరుపుగా మధ్యలో ఎక్కడో పాపం ఎడ్లు ఎందుకో కదలనని మొరాయిస్తే వాటితో తంటాలు పడుతున్న బండి వాడితో "ఇందాక ఇడ్లీలు పెట్టమంటే ,పెట్టలేదుగా అందుకనే అవి లేయ్యట్లేదు" అని అని నాదే చివరి మాట అనిపించుకున్నాను.

మొత్తానికి ఇలా మా తెలివిని దారంతా పరిచయమ చేసుకుంటూ మేము అమ్మమ్మా వాళ్ల ఇంటికి చేరాము. అక్కడ అమ్మమ్మ ఎంతొ సంతోషంగా మమ్మల్ని దగ్గరకు తీసుకొంది. చాలా ఏళ్ళ తరవాత అమ్మమ్మను చూడటంతో అంతా కొత్తగా కనపడింది. అప్పటికే అరవయ్యో వడిలో ఉన్న తను మొహమంతా ముడతలు పడ్డ చర్మంతో ఏంటో వింతగా ఉండేది. అప్పటికే రాజధానిలో nuclear families ఎక్కువవటం వల్ల, ఇంట్లో పెద్ద ప్రాణులని ఎరుగని మాలాటివారికి అన్నీ వింతే మరి .


రాత్రి అమ్మమ్మ పక్కలో చేరి తన మోచేతుల దగ్గర ఉన్న మడతలను లెక్క పెట్టటానికి ప్రయతించటం ఇంకా గుర్తు నాకు. అచ్చు గోమాతకు ఉండే గంగడోలులా సాగేది మడతలు పడ్డ తన చర్మం. అదీ, తన చారు రుచి, ఇప్పటికీ నిద్రపోయే ప్రతీసారి మూడు సార్లు చదువుకొనే "కర్కొటకస్య నాగస్య, దమయంతే నల స్థుతే. ఋతుపర్ణంచ రాజ ఋషి, కీర్తనం కలి నాశనం" ఆన్న శ్లోకం- ఇవి మేము అక్కడి నుంచి తెచ్చుకొన్న జ్ఞాపకాల మూటలు.

మరుసటి రోజు వీధిని సర్వే చేయటానికి బయలు దేరాము ముగ్గురం. ఆ వీధిలో మేమే అనుకుంటా ఏకైక బ్రాహ్మణ కుటుంబం. ప్రవృత్తి ఎలా ఉన్నా పుట్టుకకు ప్రాధాన్యం ఇచ్చే అలవాటు ఇంకా అప్పటికి ఉండటంతో "అమ్మయ్య వచ్చింది, అమ్మయ్య పిల్లలు వచ్చారు" అని బానే గౌరవించే వారు వీధిలో వారు. అందుకని బానే అతిధి మర్యాదలు జరిగేవి ఏ ఇంటికి వెళ్ళినా.

అలాగే వీధి చివరన ఉన్న శెట్టిగారి ఇంటికి వెళ్ళాము. అక్కడ వారి పిల్లలతో ఆడుకుంటూంటే అందరికీ ఉడక బెట్టిన వేరుశనక్కాయలు ఇచ్చారు. మిగితా వారందరూ మొహమాటం లేకుండా తీస్కుంటే మేము మా బస్తీ నాజూకుతనం చూపి "వద్దండి" అని తీసుకోలేదు. కానీ వల్ల పిల్లలు తింటూ ఉంటే నోరు మాత్రం ఊరుతుండేది. అలా అసలే మండుతూ ఉన్న నా పెద్ద చెల్లికి వాళ్ళబ్బాయి ఊరికే అవి చూపి "మీకు లేవు" అని ఎడిపిస్తూంటే విసుగొచ్చి వాడు తింటూన్న గిన్నెను ఎగరకొట్టింది. మరి నా పెద్ద చెల్లెలా మజాకా! దానితో మాట్లాడాలంటే మా అమ్మ నాన్నలకే హడల్ ఇప్పటికీ.


అది చూసి వాళ్ల అమ్మ "అదేంటి అమ్మయ్యా. నీకు కావాలంటే నన్ను అడగొచ్చు కదా" అని మమ్మల్ని ఇంటి ముందు ఉన్న చిన్న drianage మూత లాటిది తీసి "రండి నాతొ" అని చెప్పి మమ్మల్ని జాగర్తగా కిందకు దించింది నిచ్చెన సహాయంతో. దిగి చూద్దుము కదా ఆ పెద్ద గది నిండా వేరుశనగ బుడ్దలే (కాయలను మేము బద్దలు అని కూడా అంటాం లెండి). నిజంగా ఎంత ఆశ్చర్యమేసిందో ఆ గిడ్డంగిని చూసి, ఆ వేరుశనగ నిల్వను చూసి. మేము ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంటే వాళ్లు మమ్మల్ని చూస్తూంది పోయారు "వీళ్ళు ఎంటిరా బాబు, ఇలా ఉండిపోయారు " అని.

అవి అనే కాదు మాకు ఆ కాలంలో మా అమ్మామా వాళ్ళ ఇంటి గవాక్షము, ఇంట్లోని దూలాలు, ఇంటి పెరటిలోని కట్టెల పొయ్యి, ఇంటి ముందుకు వచ్చే "అన్నం కలిపిన అయిసుక్రీము" (అలా ఆ పేరుతొ ఎందుకు గుర్తుండి పోయిందో ఇప్పటికీ తెలీదు) , అమ్మమ్మ చింత చిగురు అమ్మే అమ్మితో చేసే బేరాలు ఇవన్నీ మాకు కొత్తా, వింతానూ.


ఇలా ఎన్నెన్నో వింతలతో రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి అనుకున్తున్నంతలోనే నా చిన్న చెల్లి చేసిన పనికి, శలవులు ఇంకా సగం ఉండగానే దాదాపు ఇంటికి తిరిగి వచ్చేంత పనయింది. మేమెవ్వరం కాఫీ, టీ తాగి ఎరగము డిగ్రీ వరకు కూడా. అందుకనే మా చిన పెద్దమ్మ (ఆమె పేరు హిట్లర్ అని కూడా లెండి ) అడిగితె మా అమ్మ "ముగ్గురికీ అలవాటు లేదులేవే, వద్దు " అని వారించింది. కొంచం సణుక్కుంటూనే తను మా అన్నయ్యలకు(తన కొడుకులకు) మాత్రం కలిపి ఇచ్చింది.

తరవాత అందరం తయారయి మా బంధువుల ఇంటికి వెళ్ళాము. అక్కడ కూడా మేమందరమూ వద్దన్నా మా చిన్నదానికి కొంచం సేపటికి ఎంత నోరు ఊరిందో ఏమో "ఆంటీ కొంచం టీ ఇస్తారా" అని అడిగి మరీ తాగింది. ఇంకేముంది, ఇంటికి రాగానే మా చిన పెద్దమ్మ పెద్ద యుద్ధమే చేసింది మా అమ్మతో "అవున్లే అమ్మా మేమెక్కడ ఆనుతాం మీ కళ్ళకూ. అడిగితె వద్దంటారు, అక్కడ మాత్రం టీ చుక్క ఉంటే ఇవ్వండి ఆంటీ అని అడిగి మరీ తాగుతారు" అని. అమ్మమ్మ సర్ది చెప్పటంతో అమ్మ ఆగిపోయింది కాని లేకుంటే మేము అప్పుడే వచ్చేసే వాళ్లము. మా పెద్దమ్మ తను కాలం చేసేంత వరకు ఆ విషయంలో మమ్మల్ని దేప్పటం మాత్రం ఆగలేదు.


అలా కోతులను "ఆంజనేయ స్వాములనీ" అనే వారికీ , ఎడ్లకు ఇడ్లీలు పెట్టమనీ, రెండు ఎడ్లబండ్లకు accident అవుతుందని నమ్మే వారికీ, అనవసరపు మొహమాటాలకు పోయే వారినీ మీ భాషలో ఏమంటారో తెలీదు కాని మేము మాత్రం "పట్నవాసపు బైతులు " అనే అంటామండి.

4 comments:

  1. బాగుంది.

    ReplyDelete
  2. :-) ... Nice ...

    ReplyDelete
  3. నరేంద్ర భాస్కర్ S.P.
    రాఘవ గారూ
    నమస్తే!
    చాలా బాగా రాసారండి

    నెనర్లు

    ReplyDelete