Friday, 17 September 2010

కాశీనాధుని స్త్రీ-1 "సిరివెన్నెలల జ్యోతిర్మయి"

ఓ చిన్న వ్యాఖ్యతో నన్ను కవ్వించి మూడేళ్ళుగా నా హృదినలంకరించిన కొత్తపాళి గారికి కృతఙ్ఞతలు. శ్రీచరణ మందార మధుపమునై వ్రాలి నిర్మల నిర్వాణ మధుధారలు గ్రోలే ఈ ప్రయత్నానినికి కారణభూతమైన కళాతపస్వికి నమోవాక్కులు. కాశీనాధుని స్త్రీని దర్శించటానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం కొత్తపాళి గారీ వ్యాఖ్యతో మొదలైనా అంకురార్పణ మాత్రం నాకు స్త్రీ అంటే ఉండే విపరీతమైన అభిమానమే. నా పుట్టుకకూ, పెరుగుదలకూ, వ్యక్తిత్వ పరిణామానికీ కారణమైన ఆ స్త్రీత్వానికి పాదాభివందనాలు.

నాకు మొదటినుంచీ కాశీనాధునివారి చిత్రాలలొని కథానాయికలంటే చచ్చేంత ఇష్టం. కానీ నా సమీక్షలలో కథానాయిక ఒక్కతే కాదు స్త్రీ. ప్రతీ చిత్రంలోనూ ప్రతి స్త్రీ పాత్రలో నాకు విస్ఫష్టంగానో నివురుకప్పుకొనో పడతి పొంకాలేవో కనిపిస్తాయి. ఆ కనీ కనిపించక మురిపించే గుణగణాల వేడుకే ఈ ప్రయత్నం. ముందే చెప్పెస్తున్నా ఆయన చిత్రాల హార్డ్కోర్ ఫాన్ని. గిరగిరా తిరుగుతూ ప్రదక్షిణాలనుకుంటూ మురిసిపోయే బాలతనమే కాని రెండుపక్కలా చూడగల నేర్పునాశిస్తే మీకు ఆశాభంగమే మరి.

చెలియ నిలిచేను స్మృతిగగనాన జాబిల్లియై, చెలిమి మిగిలేను బ్రతుకు వెలిగించు సిరివెన్నెలై అంటూ ఆయన చేత కితాబందించుకున్న జ్యోతిని పరికించి చూసే సాహసం చేస్తున్నా తొలి ప్రయత్నంగా. శృంగారపరమైన జీవితం కాబట్టి అగ్రతాంబూలం తనకే.

భూపాళ రాగం ప్రసవింప చేయటానికెన్ని హొయలు పోయిందీ సాని? ఆదిత్యాకృతి ప్రకటనంలో ప్రకృతినే తారుమారు చేసిన నేర్పరి కదా ఈ ఇందువదన? మేఘమాల తన చీరకొంగెనని చెపుతూ ఎంతగా వెలిగిపొయిందనీ "ఆదిత్య వర్ణాం తపసా జ్వలంతీం....." అన్నది గుర్తు చేస్తూ. సప్తాస్వుని భరతమంతా తన వేణీ విలాస సమానమేనని ఎంత హొయలు పోయిందీ? పాపం కుఱ్ఱాడికి మతిపోగొట్టించిన హస్త ముద్రికలు పుట్టించేది వేడి కాక ఇంకేమిటి అని ఎంత పొగరు?

ఈ ఒక్క ఘటనలో తన విశ్వరూపం చూసిన యశోదమ్మగా హరి మురిసిపోవటంలో ఇక వింతేముంది? సౌందర్యం, నిర్భీతి, నిర్మలత్వం, చొరవ చతుర్భుజాలయితె ఆకసమెత్తుగా కనిపించింది తప్పక భావుకతే అయి ఉంటుంది. తనకు తెలీని నవ్య జగత్తుని సాక్షాత్కరిస్తున్న ప్రకృతి స్త్రీని పరికించి పులకించని పురుషుడెవ్వడు? పైగా ఈ సాక్షాత్కారమంతా స్పర్శానుగతమైతే, ప్రతి అంగం ఒక వర్ణమై మెరవదా ఎంత కారుమబ్బులోనైనా. అదే జరిగింది కూడా.

కుఱ్ఱకారు కోరికలూ గుఱ్ఱాల వంటివీ కళ్ళాలు వదిలితే కదం తప్పుతాయి అన్నది వినలేదనుకుంటా జ్యోతి. చందమామకూ మచ్చలున్నాయిగా. రసికత ఎప్పుడూ బంగారు లేడి లాంటిదే చూసి ఆనందించాలే కాని స్వంతం చేసుకోవాలని అనుకోకూడదు. ఆ వ్యామొహంలో లక్ష్మణరేఖ దాటామో మనలోని రావణుడే చాలడా అగ్నిపరీక్ష వరకూ లాక్కెళ్ళటానికి? ఈ సీతమ్మా పరాయిదేశంలో బంగారు లేడికి ఆశపడింది, గీతను దాటింది. తనకు తాను ఎంత తేలిపోయిందో కృష్ణ తులాబారంలో కాని తెలియలేదీ సత్యకు.

కానీ హరి ఆత్మీయతను తూచగల తులసాకు తాను కాదని తెలుసుకోవటంలోనూ గొప్పతనంలేదూ? త్యాగమంటే హక్కులూ, భాధ్యతలూ వదిలించుకోవటమే కాదు అసలు లంకెను మొత్తం చేదించుకుని పోవాలి అన్న సంగతి తెలియటం ఒక ఎత్తయితే ఆ పని కిమ్మనకుండా చేసి చూపించిన సామర్థ్యం జ్యోతి స్వంతం. ఇక్కడ కూడా అదే ఆలోచనా గరిమ. తను చేస్తున్న పని ఒప్పే అన్న సడలని నమ్మకం. తాను పోతే హరేమవుతాడో అన్న అపనమ్మకం లేదు ఎందుకంటే అప్పటికే మాట తీసుకుందిగా మనసు శిక్షించనని. మనిషి మాట మీద ఉండాల్సిన నమ్మకం అదీ. తాను బంగారు జీవితం కోల్పోతున్నాను అన్న దుఖం లేదు నిర్వర్తిస్తున్న భాద్యతే పెళ్ళి చీరై ముస్తాబు చేస్తే పుత్తడి బొమ్మ పూర్ణమయ్యింది.

తానొక్కతే పూర్ణమయ్యిందా అంటే అంత స్వార్థం తనలోలేదు లెండి. తోడిచ్చిన అమ్మవారి నైవెద్యాన్ని కళ్ళకద్దుకోమంటూ హరి కళ్ళు తెరిపించి అతడినీ పూర్ణం చేసింది. రంభగా, మంత్రిగా, దాసిగా, తల్లిగా ఇంకా ఎన్నో పాత్రాలనిభనయించిన ఈ మాయాదేవి జ్యోతి హరిని సైతం హరించిందంటే ఆశ్చర్యం ఏమిటి?

కనిపించాయా మీకు ఈ రూపాలు?

కులం గోత్రం, గుణగుణాలు, పుట్టు పూర్వోత్తరాలు తెలీని పిల్లనెలా చేసుకుంటావురా అది బజారుదిరా అంటూ కణ్ణీళ్ళు పెట్టుకున్న అమ్మతనం, "కోకిల గుణగణాలు, గాత్రం పుట్టుకనూ పట్టించుకోని నెమలిని నేను" అని ఆవేశంలో చెపుతున్న అన్నను చూసి లోకం తెలీని తనం ఇంకా అని చిరాకు పడ్డ చెల్లితనాన్ని, చేయగల కార్యం ఏమిటో ఆలొచించగల నేర్పున్న మంత్రిత్వం, నీ కోసం నా ప్రాణాలయినా అర్పిస్తా అన్న దాస్యం అన్నీ సుస్ఫష్ఠమే కదా తన కాంతిలో.

కానీ తనంటే నాకు అసహ్యం వేసేదీ ఆ స్త్రీత్వం మూలానే. నేను అందరూ తాకిన ఎంగిలి కూడును అమ్మవారి నైవేద్యాన్ని కాను, హరికి కావాల్సింది భార్య కాదు సహ"ధర్మ"చారిణి అంటూ కబుర్లు చెపుతూనే, అతని పై ప్రేమ చూపుతూనే అతన్నీ, అతని కళనూ అవమానించింది కూడా ఈ దేవేరే కదూ.

తన వ్యక్తిత్వంతో జాగృతం చేసిన కళ ఎక్కడిది అని అనుకుందో ఆ దేవునికే తెలియాలి. స్త్రీ పురుష స్పర్శ యోగంలో జనించిన ఆ స్ఫందన అమాలిన్యమే కాని ఆ స్పర్శను ఉసిగొల్పిన శరీరం తన ధర్మాన్ని తాను పాటిస్తే మాత్రం కడగరాని మాలిన్యమయ్యిందా? ఇక మరి పశ్చాత్తాపాలకూ, ప్రాయశ్చిత్తాలకూ విలువేముందీ?

పెళ్ళంటే శారీరికమే అంటూ ఎంత పాపం చేసింది? మనసుల కలయికకు పెళ్ళి పరాకాష్టయి తీరాలా, రెండు తనువుల పెనుగులాటలోనే ఆ కలయికకౌ సార్థకతా అంటూ ఎంతగా అవమానించింది పెళ్ళినీ, కలయికనూ? ధర్మంగా బ్రతుకుతున్నా అనుకునే మనిషికి ఇలాటి ప్రశ్నలతో ముందరికాళ్ళ బంధం వెయ్యటం ఎంత ధర్మం? ఇక కాదు పెళ్ళి ఒకటే ప్రధానం కాదు అనక చస్తాడా మానవుదు. చతుర్విధాలలోని తృతీయాన్ని ఏనాడయినా మనస్పూర్తిగా సాధించగలడా ఇక మీదట ఆ పురుషుడు?

ఎందుకో ఈ విషయంలో మాత్రం సగటుతనం అలంకరించుకుంది కాశీనాధుని ఈ స్వాతిముత్యం. ఎంతయినా పెద్దాయన కదా. పైగా మెట్టినింట ఇతరుల దయమీద విడవాల్సిన తన చిత్ర కన్య భవిష్యత్తు, ఆమే నడవడికపై ఆధారపడ్డ పుట్టినింటి వారి భవిత గుర్తొచ్చి ఈ సగటుతనాన్ని నేర్పించారేమో తన కూతిరికి.లేక నిజంగానే కట్టుబాట్లు కాదనలేని జడత్వమేనేమో.

నేను మారలేను ఇక అనే అనుకుందో
నేను మారినా తగను అనే న్యూనిందో

శూన్యమయిపోయింది.

మరుజన్మ ఉందో లేదో!

No comments:

Post a Comment