Friday, 10 September 2010

చేపపిల్లలేడిస్తే అమ్మలకు తెలీదు-మట్టి బొమ్మలే కొందాం.





అమ్మా ఎందుకమ్మా మట్టి బొమ్మ కొంటాము?

"మ్మ్ మనం గణపతిని తొమ్మిది రోజులు తరవాత ఏం చేసామ్రా బాబ్డీ?" జడ చిన్నదే అయితేనేం ఎంతో గర్వంగా అల్లుకుంటున్నా  నా కొడుకులా అదీ బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో నాకు. అచ్చంగా నాదిగా మరి.  

మన కాలనీ వాళ్ళు లారీలో వెళ్తుంటే ఇచ్చాము 

వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారని చెప్పాను 

ఆ........... ఆ.......... హుసేన్ సాగర్లో వేస్తారన్నావు 

అవును. దాన్నేమంటారు చెప్పు 

నిమజ్జనం.

అయిదేళ్ళు నిండి సరిగ్గా పక్షం ఈ రోజుకు నా వినాయకునికి. ఈ వయసుకే వాడు అంత స్ఫష్టంగా నిమజ్జనం అంటుంటే నిజ్జంగా ముద్దోచ్చేసాడు. ముద్దు పెట్టుకున్నా. పెద్దగా చప్పుడయ్యేలా. ఎంగిలి తుడుచుకుంటూనే ఇంకో ముద్దు పెట్టమ్మా అన్నాడు.

నాకోసం పుట్టిన ఆదిశంకరాచార్యుడివిరా నువ్వు అని తనివితీరా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నా. ఈ బొమ్మకు ప్రాణం పోయటానికి ఎంత కష్టపడాల్సోచ్చిందో.

ఒళ్లో ఒద్దికగా కూర్చుని చెప్పమ్మా మట్టిబోమ్మే ఎందుకు అన్నాడు.

మనం ఇన్ని వేల బొమ్మలు ఆ రంగురంగులవి కొని హుసేన్ సాగర్లో పడేస్తే ఏమవుతుంది?

ఏమవుతుంది?

ఆ రంగురంగుల బొమ్మలు మొత్తం కరిగిపోవు. అందులో ఉన్న కడ్డీలు నీళ్ళో అలాగె ఉంటాయి. ఆ రంగులన్నీ పాపం చేపలను బాగా తడిపెస్తాయి. మొన్న హోలీ రోజున నువ్వు ఎక్కువ సేపు రంగునీళ్ళతో ఆడితే ఏమయింది?

"జలుబొ చ్చేసింది" చేతులు తిప్పుతూ గిల్టీగా నవ్వుతూ చెప్పాడు నా కృష్ణయ్య. వెన్న దొంగిలించావేమని అడగలేదురా కణ్నా.

కొంతసేపు రంగు నీళ్ళలో ఆడితేనే నీకు జలుబొస్తే మరి పాపం ఆ చేపలు రోజుకు ఇరవయ్నాలుగ్గంటలూ ఆ రంగు నీళ్ళల్లోనే ఉంటె ఏమవుతుంది చెప్పు?

"ఇంకా ఎక్కువ జలుబు చేస్తుందీ" మొహం వెలిగిపోతూ చెప్పాడు. అదేదో సిద్ధార్థ బోస్ క్విజ్లో ఆన్సర్ చెప్పి గెలిచినంత సంతోషంగా.

కదా ఆ రంగు రంగుల బొమ్మలు బదులు అందరూ ఈ మట్టి బొమ్మలు కొని పూజ చేసి తొమ్మిది రోజుల తరవాత అవి హుసేన్సాగర్లో వేస్తె?

ఆ వేస్తె?

అప్పుడు ఆ మట్టి కరిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది నీళ్ళ కింద మట్టి ఉంటుంది తెలుసు కదా?
 "ఎందుకో ఉర్వియామపామాయతనం అనో మేదీనామపామాయతనం" అని చెప్పలేదు పాపం పంచభూతాల్లో అన్నిటినీ స్మరించుకుని భూదేవిని మాత్రం వదిలేసారు అన్న ఆలోచన వచ్చింది.  "ఆ మిగితా అందరూ అదే సూర్యుడూ, ఇంద్రుడూ, చంద్రుడూ, వాయువు అందరూ  మగ దేవుళ్ళు కదా వల్ల సరసన ఈమెను ఉంచలేక" అని జోక్ వేసే వాడేమో. సర్లే పండగ పూట వాడి గోలేందుకు.

అవును. అయితే?

అప్పుడు మట్టి మట్టిలో కలిసిపోతుంది.  నీళ్ళలో రంగులుండవు, చేపలకు జలుబవ్వదు, ఇనుప రాడ్లవీ గుచ్చుకుని చేప పిల్లలు ఏడవవు అందరికీ హాపీస్ కదా.

పాపం అయితే మరి ప్రతి సంవత్సరం అన్ని పేద్ద పేద్ద రంగుల బొమ్మలు వేస్తాం కదా అమ్మా మరి ఆ చువ్వలకు చేప పిల్లలకు దెబ్బ్బలయ్యి ఏడిస్తే వాళ్ళమ్మకు ఎలా తెలిసేది? నీళ్ళలో తెలీదుగా పాపం ఏడుస్తున్నాయనీ అన్నాడు.

 చప్పున కౌగిలించుకున్నా. ఎక్కడనించి వస్తాయిరా నీకీ ఆలోచనలు ? పెద్దాడయిపోయి బ్రతికిపోయాడు లేకుంటే  ఆకలున్నా లేకున్నా మళ్ళీ స్థన్యమివ్వాలన్నంత  ప్రేమ అనిపించింది. నా వాడు, అచ్చంగా నా ఒక్కదానికే వీడు. he is my property. అమ్మనయినందుకు ఎంత గర్వమేసిందో.  

నిజమే నాన్నా, పాపం కదా అవి ఏడిస్తే వాటి అమ్మకు ఎలా తెలుస్తుందో? అందుకే మనం ఎప్పుడూ మట్టి బొమ్మనే కొందాం సరేనా?

ఒకే అమ్మా.



Picture used with thanks (without permission :-) and is from here

4 comments:

  1. మంచి అనుభూతిని పంచారు, ఆ చిన్నారికి అభినందనల ఆశీస్సులు.

    ReplyDelete
  2. సావిరహే, ఎస్సార్రావు, భాస్కరరామిరెడ్డి గార్లూ

    చవితి విషెస్ కు థంక్స్ అండీ


    వేణూ,
    Thanks.
    These wishes and blessings mean alot.
    Thanks again.

    ReplyDelete