Sunday, 3 April 2011

సీతారామ సంవాదం - 3



మైధిలీ. 
ఈ మన సంవాదానికి అక్షర సత్కార ఆవశ్యకత మనకు మనం వివరించుకోవలసిన భాధ్యత కూడా ఉన్నది. కావ్య లక్షణాల గురించి విని ఉండటమే కాని వాటి ఆవశ్యకత గూర్చి ఆలోచించవలసిన అవకాశం ఇప్పటివరకూ రాలేదు. ఈ మన సంవాదానికి "చిరంజీవ" అను ఆశీర్వచనమీయ యోగ్యత ఏమున్నదన్న ఆలోచన వచ్చిన పిమ్మట ఆ లక్షణములు ఏవో కొంత అవగతమయినట్టు అనిపిస్తోంది. ఆ ఆలోచనలనూ ప్రస్తావిస్తాను. 

మొట్టమొదటిగా చెప్పుకోవలసినది ఈ మన సంవాద ప్రేరణను గురించి. మన ఈ కృతికర్తయగు ఆ సామాన్యుడు సగౌరవముగా ఏ  అనురాగమును ఈ కృతికి భర్తను చేయునో ఆ అనురాగమే మన ఈ సంవాద ప్రేరకమగుట అసంకల్పితము కాదు. అదే మన ఈ సంవాద వృత్తాంతమూ అవటంలో ఆశ్చర్యమూ లేదు. కవులూ, కళాకారులూ  ఇంతమంది ఇన్ని రకములుగా ప్రస్తావించి, విశిదీకరించి, వివరించిన ఈ విషయమును తిరిగి తలచుట ఇచట పునరోక్తి దోషమే మాత్రమునూ కాదు. సూర్యకిరణములకు స్ఫ్దందించు పొద్దుతిరుగుడుబాలకూ, సరోజములకూ, కుక్కుటములకూ పునరోక్తి దోషము ఆపాదించుట న్యాయమా? నెలవుల బట్టి కదా స్ఫందనలు? పైగా వీటి స్ఫందనలకు కలికితురాయిలు వీక్షించి, స్పృశించి, శ్రవణించి, అనుభవించు మానసముల కైతోయముల వలెనే కాని వాటి స్వజనితములు కావు కదా? 

ధరణిజా.
ఈ మన సంవాదమందు సామాన్యులకు భోజ్యమగు పదార్థము ఏమున్నది? పండితార్చనకే పరిమితమగు ధర్మాధర్మ విచక్షణ, విషయ సాంద్రత వండి వారుస్తున్నామా అన్న అనుమానము కలిగినది మొదట. కాని ఆలోచించగా  అది కాదన్నది స్ఫష్టము. నీవే ఆలోచింపుము. 

తల్దండ్రులను, సోదరులను, తన జీవిత భాగాస్వామినీ, తన సంతానమునూ, తన నెలవునూ, తన కొలువునూ, తన వ్యక్తిత్వమునూ, తన ఆసక్తులనూ, తన మిత్రులనూ వారి వారి, వాటి వాటి ఆకాంక్షలను, పరిమితులనూ, అభిమతాలనూ, అబిజాత్యాలనూ మోస్తూ సంసారమను ఏకతాటిపై  నడక ఏ రాజ్యలక్ష్మీవరుడకంటే తక్కువ. సంసారమును సారవంతముగా తీర్చిదీద్దుకొవలెనను తాపత్రయము గల ప్రతి పురుషుడూ, ప్రతి పడతీ తప్పనిసరిగా నేర్వవలసినది రాజధర్మము. 

పతియే ప్రత్యక్ష దైవము, తల్దండ్రుల ఆజ్ఞ మీరజాలనిది అనునవి శిరోదార్యములైన ఈ  కాలము నుండి "భాద్యత మోసే వారే ఇంటి పెద్ద" అని స్త్రీ కొలవు సేయుచూ ఆ సంసార రాజ్యమేల పురుషుడు సంతాన, గృహ కార్యములు నెరపుచూ ఆ రాజ్యలక్షిమికి సరియగు జోడి అనిపించుకొను రోజులవరకూ ఈ రాజధర్మము ప్రతి గేస్తుకూ అవసరమే కదా.

పరస్పర విరుద్ధ మతాభిమానులైన వారిరువురూ తన వారే అయిన వారి మధ్య సంధి సలుపుట, దండించ వలసిన వారు అనుంగులయినా భాధ్యతా నిర్వహణలో అనురాగమును అనంగము సేయుట, స్వమతమూ పరమతముల మధ్య సరైన సమతుల్యమేర్పరచుకొనుట, ధర్మనిర్వహణ సమయమున స్వ పరముల మధ్య అంతరానికి ధృతరాష్ట్రుడగుట........ఇవన్నీ రాచవిద్యలే కదా.

జానకీ....రాబోవు పరిస్థితుల తలచి ఒకోసారి మనసు కన్నీరు మున్నీరగును. విద్య అనునది జీవనగతిని నిర్దేశించు గురుస్థానమునుండి కొలువు బియ్యం కొలిపించే యజమాని స్థాయికి ఎదిగిన పరిస్థితులలో తన సారధ్యము కొలువు బలగర్వమునా అర్హతానుగమనమా అను అనుమానము కలుగాసేయు అధిక్షేపణలు సేయు తండ్రిని "నాకు సంసార సారధ్యము చేయు సామర్ధ్యము వచ్చినదనే కదా పెండ్లిని చేసితివి" అని అడిగిన కుమారునకు "కాదు వయస్సు వచ్చినదని నీకు పరిణయము చేసితిని" అని జవాబిచ్చు తండ్రిని చూసి మ్రాన్పడు కాలము తప్పక వచ్చును. అక్కడ తప్పు ఆ తండ్రిదీ కాదు, కొడుకుదీ కాదు. తప్పు అసలక్కడ లేదేమో. దేశ, కాల, మాన పరిస్థితులూ అను సూత్రధారుల చేతుల్లో కీలుబోమ్మలైన ఆ నటులకు మనసు, అహం, కర్త అనునవి ఆపాదించటంలో చతురాననుని చాతుర్యములోనేమో అని దైవదూషణా ధైర్యమూ చేయును మనసు ఒకోసారి. 

సరి సరి........మానసవనచరవరము పెక్కు దిక్కుల గెంతుచున్నది, కట్టడి సేయవలె.

దేవీ
కావ్యలక్షణములు అంటి కదా? ప్రస్తావింపక వదిలివేయగ వీలవదు. ఈ కృతిసారము ఏ పరిమితులకూ........కాల, మాన, దేశ, సంస్కృతీ వృత్త ఛట్రమూలకూ.......లోబడి ఉండదు. కావున కర్తకు ఈ కావ్య లక్షణ జ్ఞానము శూన్యము అనునదే నా ఆజ్ఞ. కావ్యాలంకార శాస్త్రము కావ్యముల సమూలాగ్ర శోధన నుండి పుట్టినది కాని అలంకార శాస్త్ర విషయముల నుండి కావ్యము పుట్టలేదు, పుట్ట జాలదు అను సత్యనిరూపణ చేయుచూ ఈ కావ్యమున సహజ కావ్య లక్షణ ప్రస్ఫుటము మెరయుగాక అనునది నా ఆశీర్వచనము. 

సారమును బట్టి భాషా, భాషను బట్టి సారమా అను సందిగ్ధమును పరిష్కరించు భాద్యతను కర్తకు వదిలివేయుచున్నాను. శారదాంబ కటాక్ష వీక్షణా తరంగాములే తీరునా పామరుని నడిపించునో ఆ తీరుగనే జరుగుగాక. పామరుని పరిమితుల లోబడే, యాతని షడ్రిపులనాపకయే, ఈ కృతి జనించుగాక. అపుడే ఇది పండిత పామర జనరంజకమే కాక పండిత పామర జన ప్రేరకమూ అవగలదు. 

అస్తు అస్తు అస్తు.   

No comments:

Post a Comment